కలం, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం (Heavy rains) కురిసింది. దుబ్బాక మార్కెట్ యార్డులో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసింది. గజ్వేల్లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు.
నర్సాపూర్, తూప్రాన్, చేగుంట, రామాయంపేటల్లో అకాల వర్షానికి కల్లాల్లోని వరి ధాన్యం తడిసింది. అకాల వర్షంతో రైతుల వడ్ల రాశులను వరద నీరు ముంచెత్తింది. కల్లాలలో, కొనుగోలు కేంద్రాలు, రోడ్లపైన ఉన్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి అర్ధరాత్రి నుంచి రైతులు నానా అవస్థలు పడ్డారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

