కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడం, మరోవైపు వేసవి సెలవులు ముగుస్తుండడంతో యాదగిరీశుని దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓం నమో నారసింహాయ నమః అనే మంత్రంలో స్వామివారి ఆలయ వీధులు మారుమారుతున్నాయి. వేదమంత్రోచ్చారణల నడుమ లక్ష్మీ నరసింహుడికి జరిగే నిత్య కైంకర్యాలను వీక్షించి భక్తులు పునీతులవుతున్నారు. వాతావరణం కాస్త చల్లబడటంతో యాదగిరి ప్రాకారాలను ఆస్వాదిస్తూ ఆలయ దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల రద్దీతో యాదగిరిలో సందడి వాతావరణం నెలకొంది.

