కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం తిరుమల (Tirumala)లో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతోంది. సెలవుదినం కావడంతో ఆలయంలోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి సర్వదర్శనానికి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. శనివారం 92,830 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. లడ్డూలు 4.64 లక్షలు విక్రయించినట్లు తెలిపారు.
సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శన కోటా..
అటు సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శన కోటా విడుదలకు టీటీడీ షెడ్యూల్ ఖరారు చేసింది. జూన్ 18న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లను విడుదల చేయనుంది. ఈ ఆర్జిత సేవల కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదుకు అవకాశం కల్పించింది. జూన్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు విడుదల చేయనున్నారు.
జూన్ 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా విడుదల చేయనున్నారు. జూన్ 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లుతోపాటు మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటా విడుదల చేయనున్నారు. టీటీటీ అధికారిక వెబ్సైట్ http://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే భక్తులు సేవా టికెట్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

