కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ బస్టాండ్ (Karimnagar Bus Stand) ప్రాంతం వ్యభిచార కేంద్రంగా మారింది. వచ్చీ పోయే ప్రయాణికులతో మూడు పువ్వులు ఆరు కాయలుగా దందా సాగుతోంది. కింద లిక్కర్ బారులు.. పైన లాడ్జీలతో ఈ వ్యాపారం సాగుతుండగా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. కూతవేటు దూరంలోనే కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉండగా.. మరి కొంత దూరంలోనే పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఉంది. పెద్ద ఎత్తున పోలీసులున్నప్పటికీ ఈ వ్యభిచార దందాను అరికట్టడంలో విఫలమవడం పట్ల మామూళ్ల వ్యవహారమే కారణమనే ప్రచారం జరుగుతోంది.
బస్టాండ్ అవుట్ గేట్ సమీపంలోని పలు లాడ్జీల కేంద్రంగా ఈ వ్యభిచారం నడుస్తోంది. కింద ఓపెన్ బారుల్లో మద్యం సేవించిన వారిని.. అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తూ లాడ్జీలకు తీసుకెళ్లి వ్యభిచారం సాగిస్తున్నారు. అటు లాడ్జీలకు.. ఇటు వ్యభిచారిణిలకు దండిగా సమకూరుతుండడంతో కొంత మంది పోలీసులు సైతం బారులు, లాడ్జీలలో వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉదయం ఆరు గంటలకే మద్యం షాపులు ఓపెన్ చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు.. అటు ఎక్సైజ్.. ఇటు పోలీసు యంత్రాంగాన్ని అంతగా మేనేజ్ చేస్తుండడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోందటున్నారు. పై అధికారులు హెచ్చరిస్తే బారులు, లాడ్జీలవైపు వచ్చి బెదిరించినట్లే వెళ్తున్నారే తప్ప అక్కడ అంతా మామూలుగానే వ్యవహారం సాగుతోంది.
ఇప్పటికే లాడ్జీల విషయంలో పోలీసు కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించాలని, ఐడి కార్డులతో పాటు అన్నీ ఆరా తీయాలని హెచ్చరిస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కరీంనగర్ బస్టాండ్ ఏరియాలో విచ్చలవిడి వ్యభిచారంతో పాటు లిక్కర్ బారులను అదుపులో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

