కలం, జనగామ : జనగామ జిల్లాలో ఎండాకాలంలో ప్రత్యేకంగా కాసే సీజనల్ పండల్లో ఈత పండ్లు (Palm Dates) మార్కెట్లలోకి వచ్చేశాయి. అటవీ ప్రాంతాలు, పొలాల అంచులు, చెరువుల వద్ద ఎక్కువగా కనిపించే ఈ పండ్లు గ్రామీణ ప్రజలకు ఉపాధితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తున్నాయి. మొదట ఎర్రగా కనిపించే ఈ పండ్లు పక్వానికి రాగానే నలుపు రంగులోకి మారుతాయి. చిన్న గింజల మాదిరిగా ఉండే ఇవి తియ్యటి రుచితో పాటు స్వల్పంగా పులుపు కలిగివుంటాయి. ఈత పండ్లు పోషక విలువలతో నిండి ఉంటాయి. వేసవిలో శరీరానికి చల్లదనం ఇవ్వడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, రక్తహీనత తగ్గించడంలో సహాయపడడం, శక్తిని పెంచడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
సహజ యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ప్రస్తుతం జనగామ మార్కెట్లలో ఈత పండ్ల (Palm Dates)కు మంచి డిమాండ్ ఉంది. చిన్న కప్పు రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తుండగా, కిలో ధర రూ.150 నుంచి రూ.250 వరకు ఉంది. గ్రామీణ మహిళలు, చిన్న వ్యాపారులు వీటిని సేకరించి రోడ్ల పక్కన, చిన్న మార్కెట్లలో అమ్ముతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. పట్టణాల్లో కూడా ఈత పండ్లకు ఆదరణ పెరుగుతోంది. సరైన ప్యాకేజింగ్తో విక్రయిస్తే యువతలో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. జ్యూస్, జామ్, డ్రై ఫ్రూట్స్ రూపంలో తయారు చేసి విక్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రకృతి ప్రసాదించిన ఈత పండ్లు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రజలకు ఆదాయ వనరుగా మారాయి. ఎండాకాలంలో తప్పక తీసుకోవాల్సిన సహజ పండ్లలో ఇవి ఒకటి.
Read Also: బీ అలర్ట్.. మహిళలకు నిద్రతక్కువైతే ఈ హెల్త్ ఇష్యూస్ అటాక్!
Follow Us On : WhatsApp

