కలం, నల్లగొండ బ్యూరో: హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో లిఫ్ట్ స్కీమ్స్ను ఖరీఫ్ 2026 నాటికి పూర్తి చేయాలని తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో సూర్యాపేట జిల్లా నీటిపారుదల అధికారులతో మంత్రి విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని ఎత్తిపోతల పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, జవహర్ జనపహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వంటి ప్రధాన పథకాల స్థితిగతులను పరిశీలించారు. 53 వేల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ లక్ష్యంతో రూ. 1,642 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పురోగతిని ప్రత్యేకంగా సమీక్షించారు.
రూ. 292 కోట్ల వ్యయంతో 10,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన జవహర్ జనపహాడ్ బ్రాంచ్ కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పురోగతిపై కూడా వివరాలు తెలుసుకున్నారు. కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న లిఫ్ట్ పథకాలను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎత్తిపోతల పథకాలన్నింటికీ ట్రాన్స్కో అధికారులతో సమన్వయం చేసుకొని ట్రాన్స్ఫార్మర్ యార్డులు, విద్యుత్ సరఫరా సదుపాయాలు సమయానికి ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న నీటిపారుదల కార్యాలయ భవనాల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని సూచించారు. హుజూర్నగర్లో రూ. 7.99 కోట్లతో ఒకటి, కోదాడలో రూ. 5.12 కోట్లతో మరొకటి నిర్మిస్తున్నమన్నారు. ఈ భవనాల రూపకల్పన, నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని చీఫ్ ఇంజినీర్ నాగభూషణ్రావును బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా రైతులకు రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచే నిరంతర సాగునీరు అందేలా అన్ని పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సమావేశంలో ఈఎన్సీ జనరల్ రమేష్ బాబు, ఓఎస్డీ ఇరిగేషన్ భీమ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

