కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ‘సత్యమేవ జయతే’ అంటూ స్పందిచారు. ఎన్ని కుట్రలు పన్నినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా మరోసారి నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రాథమిక హక్కులను, సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి సాగించిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమని హరీశ్ రావు అన్నారు. ముఖ్యంగా వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామాలకు ఈ తీర్పు ఒక చెంపదెబ్బ వంటిదని ఆయన అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు, రాజకీయ దుష్ప్రచారాలు పక్కన పెట్టాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. కాలయాపన చేయకుండా వెంటనే ప్రాజెక్టులోని రెండు పిల్లర్ల మరమ్మతులను పూర్తి చేసి, తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పటికీ తెలంగాణకు ‘ప్రాణేశ్వరం’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

