కలం, ఖమ్మం బ్యూరో: సీపీఐ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు (CPI ML Leader) ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నేడు విచారించనున్నారు. ఈ నెల 2వ తేదీన నోటీసులు అందుకున్న పోటు రంగారావు (Potu Rangarao), విచారణకు సిద్ధంగా ఉన్నానని అధికారులకు తెలిపారు. ఎన్ఐఏ (NIA) అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం.. హైద్రాబాద్ మాదాపూర్లోని ఎన్ఐఏ ఆఫీసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆరోగ్య కారణాల రీత్యా ఖమ్మం (Khammam) లోని పార్టీ కార్యాలయం అయిన రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో ఉంటానని అధికారులను కోరారు. దీంతో బుధవారం అధికారులు ఖమ్మం చేరుకుని విచారించనున్నారు.
గత ఏడాది నవంబర్ 26న మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎన్ఐఏ కేసు నమోదు చేయగా.. నేడు విచారణ జరగనుంది. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 152 దేశ ద్రోహం, ఉగ్రవాద వ్యతిరేక చట్టం(UAPA)లోని సెక్షన్ 13, 39ల ప్రకారం రంగారావుపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే, సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఆయనకు నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. కాగా పోటు రంగారావు, గుమ్మడి నర్సయ్య, ఇతర వామపక్ష నాయకులు ఈ కేసును ఖండిస్తున్నారు. తాము బహిరంగంగా ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తున్నామే తప్ప ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కుట్రలు చేయలేదని, కేవలం ప్రశ్నించే గొంతు నొక్కడానికే ప్రభుత్వం ఇలాంటి అక్రమ కేసులు పెడుతుందని వారు ఆరోపిస్తున్నారు.

