కలం, మెదక్ బ్యూరో : అసెంబ్లీ వేదిక గా బిఅర్ఎస్ ముఖ్యనేత నేత హరీశ్ రావు ప్రసంగం పటాన్ చెరు (Patancheru) నియోజకవర్గ రాజకీయాల్లో చిచ్చుపెట్టాయి. 28 తేదిన మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ గురించి హరీశ్ రావు (Harish Rao) శాసనసభలో మాట్లడుతున్న సందర్భంగా.. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డికి సంబంధించిన స్టోన్ క్రషర్ కంపెనీలో చిన్నతప్పును పట్టుకొని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే అరెస్టు చేసి నెలరోజులు జైల్లో పెట్టారన్నారు. అదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Minister Ponguleti) సంబంధించిన రాఘవ కన్ స్టక్షన్స్ పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రతిపక్షానికి ఒకన్యాయం.. అధికార పార్టీ మంత్రులకు ఒక న్యాయం ఉటుందా అని ప్రశ్నించారు హరీశ్ రావు. ఇదే ప్రసంగం కారణంగా గత నాలుగు రోజులుగా పటాన్ చెరు లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య పోటాపోటి సవాళ్లతో రాజకీయ వేడిని రగిలిస్తోంది.
అవినీతి పరుడికి అండగా ఉంటారా : కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్
అసెంబ్లీలో హరీశ్ రావు.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని (Gudem Mahipal Reddy) వెనకేసుకురావడంపై కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. అవినీతిపరుడు, అక్రమార్కుడు, కబ్జాదారుడైన గూడెం సోదరులకు మద్దతుగా మాట్లడటం సిగ్గుచేటని.. మైనింగ్ శాఖకు మహిపాల్ రెడ్డి సోదరులు 340 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టారు.. ఇది చిన్న విషయమా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో హరీశ్ రావు తెలంగాణ ఉద్యమకారుల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా.. అవినీతి పరుడైన గూడెం మహిపాల్ రెడ్డికి మద్ధుతుగా మాట్లడటం సరికాదన్నారు. 2023 మార్చిలోనే BRS ప్రభుత్వ హయంలో గూడెం మధుకు సంబంధించిన మైనింగ్ లో అక్రమాలు జరిగాయని మైనింగ్ శాఖ నివేదిక ఇచిందన్నారు.
నిజంగా బిఅర్ఎస్ నేతలకు నిజాయితీ ఉంటే, మహిపాల్ రెడ్డి సోదరులపై నమ్మకం ఉంటే CB, CID విచారణకు మద్దతు ఇవ్వలన్నారు. మహిపాల్ రెడ్డి అక్రమాలపై సిట్ విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు. ‘ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఒక పెద్ద స్కామర్, అక్రమ మైనింగ్, అసైన్డ్ భూముల కబ్జాలు ఇవన్నీ ఎమ్మెల్యే గా అయన ఘనకార్యాలు. మహిపాల్ రెడ్డి మైనింగ్ అక్రమాలు, భూ కబ్జాలపై విచారణ చేయాలని మంత్రులు, అధిష్టానాన్ని కలుస్తాను’ అని కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
’కాటా‘కు ఎమ్మెల్యే గూడెం కౌంటర్..
పటాన్ చెరువు (Patancheru) కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాప్ విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తాను క్వారీని నడిపినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షతో అనుమతికి మించి మైనింగ్ చేస్తున్నారంటూ నిబంధనలకు విరుద్ధ్దంగా క్వారీని సీజ్ చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ అంశంపై ఫిజికల్గా రీసర్వే నిర్వహించాలని హైకోర్టుకు, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. జిల్లా మంత్రి ఒత్తిడితో రాత్రికి రాత్రే గూడెం మధుసూదన్ రెడ్డిపై ఐటీ, ఈడీ, ఇరిగేషన్, పొల్యుషన్ అంటూ 11 కేసులు పెట్టి, 30 రోజులు జైల్లో పెట్టారని ఆరోపించారు. క్వారీ తవ్వకాలపై సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే , ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్కు కేటాయించిన ఫైల్ను మాయం చేశారని ఆరోపించారు.
కాటా శ్రీనివాస్ గౌడ్ జిల్లా మంత్రి కుమార్తె పెండ్లి పేరుతో ఎన్ని డబ్బులు వసూలు చేశాడని, సొంత కుటుంబ సభ్యులపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇబ్బందులు పెట్టడన్నారు. పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్, దేవాదాయ శాఖ చైర్మన్లను చేయడానికి డబ్బులు తీసుకున్నాడని అరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక, సీట్ల పంపకాలకు డబ్బులు వసూలు చేసిన వ్యక్తి అని, ప్రజలతో మంచి సంబంధాలు పెంచుకొని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావాలని సూచించారు. తప్పుడు పనులు చేసి రెండున్నర ఏండ్లకే సర్పంచ్ పదవిని చేతగాక వదిలేశాడని గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు.
బస్తీ మే సవాల్…
సాధరణంగా ఎన్నికల సమయంలో సవాళ్లు …ప్రతి సవాళ్లతో చెలరేగుతారు కానీ హరీశ్ రావు అసెంబ్లీ లో ప్రసంగణం తర్వాత పటాన్ చెరులో (Patancheru) సవాళ్ల రాజకీయం నడుస్తుంది. ‘గురువారం ఉదయం 11 గంటలకు బీరంగూడ శివాలయం వద్దకు నేను వస్తా.. నిజాయితీపరుడైతే మహిపాల్ రెడ్డి రేపు శివాలయం వద్దకు రావాలి. తప్పు మాట్లాడితే దేవుడు నన్ను శిక్షిస్తాడు. ఎమ్మెల్యే తప్పు మాట్లాడితే దేవుడు మహిపాల్ రెడ్డిని శిక్షిస్తాడు. ఇద్దరం కలిసి తడి బట్టలతో ప్రమాణం చేద్దాం’ ’ అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. మహిపాల్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని.. తాను ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటానన్నారు కాట. దీంతో పటాన్ చెరులో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. అధికార.. ప్రతిపక్ష నాయకులు వరుసగా ప్రెస్ మీట్ల పెడుతూ..సోషల్ మీడియా వేదికగా రాజకీయ యుద్ధం చేస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యల పై కాకుండా ఇరువురు నేతలు అక్రమాలు, అరోపణలు, భూ కబ్జాలు, వసూళ్ళు.. సవాళ్లతో ఒకరి విషయంపై మరొకరు ఓపెన్ అవుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
Read Also: ఛలో చంద్రమండలం..! అపోలో టూ ఆర్టెమిస్
Follow Us On: X(Twitter)

