కేరళలో రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లి అబద్ధాలు చెప్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు అస్తవ్యస్తంగా ఉందని, గ్రామసభల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘ఇంట్లో ఈగల మోత ఉంటే బయట పల్లకీలు మోస్తున్నట్లు’ రేవంత్ తీరు ఉందని హరీశ్ రావు అన్నారు. సొంత రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలేసి పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేయడం హాస్యాస్పదమని సెటైర్లు వేశారు. అసెంబ్లీ సాక్షిగా రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలుకాలేదని, కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని హరీష్ రావు విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ కాగితాలకే పరిమితం

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ మాటలకే తప్ప చేతలకు పనికిరాదని హరీష్ రావు విమర్శించారు. గడిచిన రెండున్నర ఏళ్ల కాలంలో ఎస్టీ కార్పొరేషన్ కోసం రూ. 2730 కోట్లు కేటాయించి, కేవలం రూ. 50 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను చిన్నచూపు చూస్తోందని, నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులకు, గిరిజనులకు ఒరిగింది ఏమీ లేదని, ఆచరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.

లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వరా?

రాజకీయంగా కూడా గిరిజనులను కాంగ్రెస్ మోసం చేస్తోందని, ఇంతవరకు లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడమే అందుకు సాక్ష్యమని హరీశ్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించామని, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి స్వయం పాలన అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకొని, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>