కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలతో జరిగిన దాడి అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని అన్నారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందని చురకలు అంటించారు. ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియా పై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు అని అన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు? అంటూ ప్రశ్నించారు.

ఒకవైపు “హేట్ స్పీచ్ బిల్” పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ.. మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన? అని ఫైర్ హరీశ్ రావు అయ్యారు. ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ.. గూండా రాజ్యం అమలు చేస్తారా? అంటూ దుయ్యబట్టారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ పాలనను గాలికి వదిలేసారా? అని మండిపడ్డారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే.. ఇక్కడ పాలనను ఎవరు చూస్తారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని.. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారని హరీశ్ ఫైర్ అయ్యారు. ‘మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు ఆపకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>