కలం, వెబ్ డెస్క్: రైతు డిస్కం పేరిట రాష్ట్ర ప్రభుత్వం మూడో విద్యుత్తు పంపిణీ సంస్థ ఏర్పాటు చేయడం వెనుక ప్రైవేటీకరణ కుట్ర దాగిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. వెంటనే, రైతు డిస్కం లైసెన్స్ దరఖాస్తును తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు లేఖ రాశారు. రైతు డిస్కంపై ప్రజాభిప్రాయం తీసుకోకుండా, అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందన్నారు. రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండానే ఇలా చేసిందన్నారు. విద్యుత్తు చట్టం ప్రకారం 30 లక్షల మంది రైతుల అనుమతి లేకుండా కొత్త డిస్కంలోకి మార్చడం చట్టవిరుద్ధమన్నారు.
కొత్త డిస్కంకు రూ.35 వేల కోట్ల వసూళ్ల బాధ్యతనా..?
కొత్త డిస్కం ఏర్పాటే గందరగోళంగా ఉందని హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. 29 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులకు పనిచేసేందుకు కేవలం రెండు వేల మంది సిబ్బందిని కేటాయించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కొత్త డిస్కంలో చేరే ఉద్యోగులకు ప్రత్యేక ప్రమోషన్ల ఆశ చూపిస్తూ.. ప్రలోభాలకు గురి చేస్తున్నారని వివరించారు. సిబ్బంది కొరత, సమన్వయ లోపంతో క్షేత్రస్థాయిలో విద్యుత్తు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు. డిస్కంకు ఆదాయ వనరులు చూపకుండా, రూ.35 వేల కోట్ల బకాయిల వసూళ్ల బాధ్యత అప్పగించడమేంటన్నారు. బహిరంగ విచారణ పూర్తి కాకముందే జూన్ రెండో తేదీ నుంచి డిస్కం ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది కమిషన్ను ఒత్తిడికి గురిచేయడమే అని, అన్ని జిల్లాల్లో బహిరంగ విచారణలు జరిపిన తరువాతే డిస్కం ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Read Also: తుమ్మిడిహెట్టి బ్యారేజ్పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
Read Also: డిజిటల్ విప్లవం

