కలం, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామ రైతులు, ఉపాధి హామీ కూలీలతో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ముచ్చటించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకముందు సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో మహంకాళి అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా సిద్దిపేట రంగదాంపల్లి పంచవటి హనుమాన్ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్ష విరమణ చేస్తున్న హనుమాన్ స్వాములకు హరీశ్ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు గన్నీ సంచుల కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని సమస్యలపై అటు ముఖ్యమంత్రికి, ఇటు మంత్రులకు ప్రజల సమస్యల పట్ల కనీస పట్టింపు లేదని దుయ్యబట్టారు. సమస్యలను లోతుగా అర్థం చేసుకుని, వాటి పరిష్కారం కోసం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

