కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఒక వైపు జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న సమయంలో హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏప్రిల్ 22న హైకోర్ట్ తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలన్న దానిపై బీఆర్ఎస్ వ్యూహాన్ని రచిస్తోంది. తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తమ లాయర్లతో హరీశ్ రావు హాజరు కానున్నారు. హరీశ్ రావుతో పాటు వినోద్ కుమార్ కూడా ఢిల్లీకి వెళ్లారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లిందని బీఆర్ఎస్ అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రతినిధుల బృందంలో హరీశ్ రావు, వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర ఉన్నట్లు పేర్కొంది. ఎల్లుండి తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్పై వెలువడనున్న తుది తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను సిద్ధం చేసేందుకు వీరంతా ఢిల్లీ వెళ్లారని తెలిపింది.

