కలం, వెబ్ డెస్క్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) సంస్థకు చెందిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 1949 జూలై 9న కేవలం ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. ఆవిర్భావం నుంచి నేటి వరకు విద్యార్థుల సమస్యల పరిష్కారంతో పాటు అనేక కీలక ఉద్యమాలను విజయవంతంగా చేపట్టిందని తెలిపారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారంతో పాటు దేశ రక్షణ, జాతీయ ప్రయోజనాల కోసం ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. జాతీయవాద భావజాలం, భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యాన్ని బలోపేతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. విద్యార్థుల సంక్షేమం, జాతీయ ప్రయోజనాల సాధన కోసం ఏబీవీపీ మరింత ఉత్సాహం, నూతన శక్తితో తన సేవా ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

