కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారని హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ లో జరిగిన అంశాలకు సంబంధించి కేసీఆర్ అనని వ్యాఖ్యలను ఆయనకు ఆపాదించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పేపర్లను ఆయన ప్రదర్శించారు. కేసీఆర్ గతంలో ఏం మాట్లాడారో వివరించారు. ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగానికి తీరని అన్యాయం చేసిందని.. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ఆయకట్టు వచ్చిందని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రేవంత్ రెడ్డి సగం సగం చదివి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పారని హరీశ్ రావు విమర్శించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన వాక్యాలను కేసీఆర్కు ఆపాదించారని మండిపడ్డారు.
దేవుడి మీద ఒట్టేసి అబద్ధాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దేవుడి మీద ఒట్టేసి తాను నిజాలు మాత్రమే చెబుతానని చెప్పి.. అన్నీ అబద్ధాలే చెప్పారన్నారు. కేసీఆర్ (KCR) తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడిన అంశాలను పక్కన పెట్టి.. ఎవరో మాట్లాడిన విషయాలను కేసీఆర్కు ఆపాదించారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని.. ఆయనకు నిజంగానే చీము, నెత్తూరు ఉంటే రాజ్భవన్ కు వెళ్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దాడులకు భయపడను
తాను నిజాలు చెబుతున్నందుకు రేవంత్ రెడ్డి తన మీద తప్పుడు కేసులు పెడతారని హరీశ్ రావు అన్నారు. గతంలో తన మీద రాళ్లదాడి చేయించారని.. ఎన్ని దాడులు చేయించినా తాను భయపడేది లేదన్నారు. గతంలో దేవుళ్ల మీద ఒట్లు వేసి రుణమాఫీ ఎగ్గొట్టారని.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతానికి ఎన్ని నీటి కేటాయింపులు జరిగాయి? బీఆర్ఎస్ పాలనలో ఎన్ని నీటి కేటాయింపులు జరిగాయో హరీశ్ రావు (Harish Rao) లెక్కలతో సహా వివరించారు.
Read Also: వెనెజువెలాకు ఫ్రీ ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
Follow Us On: Pinterest


