కలం, వెబ్ డెస్క్ : 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓట్లు అడుగుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సవాల్ విసిరారు. రైతు డిస్కంపై ఆయన మీడియాతో మాట్లాడారు. టీజీఆర్పీడీసీఎల్ తుగ్లక్ చర్య అని విమర్శించారు. డిస్కం ఏర్పాటుతో ప్రాజెక్టులకు కష్టాలు వస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ జిల్లాకు నీరు రావాలన్నా 24 గంటల విద్యుత్ అవసరం ఉందని హరీశ్ రావు చెప్పారు. రైతు డిస్కం పేరిట విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి రేవంత్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆయన ఆరోపించారు. ఉన్న డిస్కంలు నడవలేనప్పుడు మూడో డిస్కం అవసరం ఎందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

