కలం, వరంగల్ బ్యూరో : మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. సోమవారం నగర పరిధిలోని 48, 49, 50, 51 డివిజన్లలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన కలెక్టర్, పన్ను వసూళ్ల తీరును ప్రత్యక్షంగా పరిశీలించి సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయంలోని ఈ-సేవ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పన్ను చెల్లింపుల ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఎంత మొత్తంలో వసూళ్లు జరుగుతున్నాయి, ఏ సమయాల్లో సేవలు అందిస్తున్నారు.. వంటి అంశాలపై విచారించారు.
51వ డివిజన్లో రెవెన్యూ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి పన్ను వసూళ్ల విధానాన్ని పరిశీలించారు. 50వ డివిజన్లో పర్యటించిన సందర్భంలో సంబంధిత డివిజన్లకు చెందిన బకాయిల జాబితా, ఇప్పటివరకు జరిగిన వసూళ్ల వివరాలు, ఇంకా వసూలు చేయాల్సిన బకాయిల జాబితా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ జాబితాను ఆధారంగా తీసుకుని, బిల్ కలెక్టర్లు ప్రతి 20 అస్సెస్మెంట్ ల చొప్పున విభజించి వసూళ్లను చేపట్టాలని తెలిపారు. అలాగే, పి.ఓ.ఎస్ యంత్రాలను వినియోగంలో ఉంచి, ప్రజలు స్థానికంగానే పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలోని ప్రతి గృహం నుంచి పన్నులు చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు.
49వ డివిజన్లో పర్యటించిన సందర్భంగా ఒకే ఇంటికి రెండు లేదా మూడు హౌస్ నంబర్లు ఉండడాన్ని గమనించిన కలెక్టర్ (Collector Chahat Bajpai) వాటిని తక్షణమే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. 48వ డివిజన్లో సుమారు 900 గృహాల నుంచి పన్ను వసూళ్లు చేపట్టాలని సూచిస్తూ, కొన్ని డివిజన్లలో రూ.లక్షల్లో బకాయిలు ఉన్నాయని తెలిపారు. లక్ష్యాలను సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ, ప్రతిరోజూ వార్డులో కనీసం రూ. 3 లక్షల వసూళ్లు సాధించాల్సిందిగా అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సీహెచ్ఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, ఆర్ఐ అనిల్ కుమార్, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు తదితరులు ఉన్నారు.
Read Also: వేగంగా పెరుగుతున్న లంగ్ క్యాన్సర్.. కారణాలు చెప్పిన అధ్యయనం
Follow Us On: Pinterest

