కలం, వరంగల్ బ్యూరో: భద్రకాళి చెరువు (Bhadrakali Lake) పూడికతీత పనులను వేగవంతం చేసి మే 15 నాటికి పూర్తి చేయాలని హనుమకొండ (Hanamkonda) జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో భద్రకాళి చెరువు పూడిక మట్టి తరలింపుపై అధికారులు, కాంట్రాక్టర్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భద్రకాళి చెరువు పూడిక మట్టిని రెడ్డిపురం, పలివేల్పుల, మామునూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో డంపింగ్ చేయాలని సూచించారు.
మట్టి తరలింపులో ఎలాంటి అవరోధాలు రాకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో పోలీస్ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటుక బట్టీల యజమానుల నుంచి మట్టి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. అవసరమైన మట్టికి డీడీలు చెల్లించి తీసుకెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
భద్రకాళి చెరువు (Bhadrakali Lake) ఇన్ఫ్లో, ఔట్ఫ్లో రెగ్యులేటరీ పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలన్నారు. అలాగే వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు ఎన్. రవి, వై.వి. గణేశ్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్, సాగునీటి పారుదల సీఈ సుధీర్, ఎస్ఈ రాంప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, కుడా సీపీవో అజిత్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ ఈఈ కిరణ్ కుమార్, డీఈఈ మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అని నిరూపించారు : కవిత
Follow Us On : WhatsApp

