కలం, వెబ్ డెస్క్: పేపర్ లీకేజీల వ్యవహారంపై జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఆందోళనల (CJP Protest) నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ శాంతియుత నిరసనలను కొందరు బయటి వ్యక్తులు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీజేపీకి సమాజంలో వస్తున్న మంచి గుర్తింపును దెబ్బతీసేందుకు, పార్టీకి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
తమ నిరసన కార్యక్రమాల్లోకి బీజేపీకి చెందిన వ్యక్తులు చొరబడుతున్నారని అభిజిత్ దీప్కే ఆరోపణలు చేశారు. క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు ఆ వ్యక్తులే పూర్తి బాధ్యులని ఆయన అన్నారు. అంతేకాకుండా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చర్చించాలనుకుంటే తాము ఎప్పుడైనా సిద్ధమేనని, జంతర్ మంతర్ ఎప్పుడూ తెరిచే ఉంటుందని దీప్కే ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన తాజా ట్వీట్పై స్పందించిన సీజేపీ.. పేపర్ లీకేజీల బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేసే వరకు ఈ ఆందోళనలను విరమించేది లేదని పేర్కొన్నారు.

