కలం, నల్లగొండ: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం అవసరమని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy) అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని బైపాస్ వద్ద ఉన్న ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అయినా, వివిధ రంగాల్లో ఇంకా నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోజురోజుకు తగ్గిపోతున్న పశు సంపదను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు, మోడల్ పాఠశాలలు ఏర్పాటు, విద్యార్థులకు యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం అమలు చేస్తోందన్నారు.
పాఠశాలల్లో ఇక నుంచి అల్పాహారం..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం కూడా అందింబోతున్నారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసినా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తున్నామని వివరించారు. జూన్ 2 నాటికి జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

