కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా నిర్వహించిన ‘ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్’ సైకిల్ ర్యాలీ (Bicycle Rally) ని లాంఛనంగా ప్రారంభించారు. ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, క్రీడా శాఖ అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రోజుకు అరగంట వ్యాయామం అనే నినాదంతో ప్రజల దైనందిన జీవితంలో సైక్లింగ్ను భాగం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సైక్లింగ్ను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మారుతున్న జీవనశైలిలో సైక్లింగ్ చేస్తే ఆరోగ్యకర జీవనాన్ని గడుపుతారని వెల్లడించారు.

