కలం, వెబ్ డెస్క్: పిల్లలు మంచిగా చదివితే ఉపాధ్యాయులు అభినందించడం కామన్. వారికి ఇష్టమైన గిఫ్టులు ఇస్తూ ఉన్నతంగా చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ తమిళనాడు (Tamil Nadu)కు చెందిన ఓ మాస్టర్ మాత్రం తమ పాఠశాల పిల్లలను విమానం ఎక్కించి ఆశ్చర్యపర్చాడు. తమిళనాడులోని తెన్కాశి జిల్లా కొండనూరు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ (Government School Principal) మైఖేల్ రాజ్ విద్యార్థుల కోరికను నెరవేర్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు విమాన ప్రయాణం అనేది అందని ద్రాక్షలాగే ఉంటుంది. అయితే విమానాన్ని ఒక్కసారైనా దగ్గర నుండి చూడాలని, అందులో ప్రయాణించాలని కలలు కంటున్న విద్యార్థుల కోసం అద్భుతమైన ప్రయాణాన్ని ప్లాన్ చేశాడు.
ఓసారి రైట్ బ్రదర్స్ గురించి పాఠం చెబుతున్నప్పుడు ఆలోచన తట్టింది. ఆ సమయంలో మైఖేల్ రాజ్ విద్యార్థులను వారి కలల గురించి అడగగా, అందరూ జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని ఉందని చెప్పారు. వారి మాటలకు చలించిపోయాడు. మదురై నుండి చెన్నైకి వెళ్లే ఇండిగో విమానంలో 20 మంది విద్యార్థులు, ఎనిమిది మంది ఉపాధ్యాయుల కోసం టిక్కెట్లు బుక్ చేశాడు.
అయితే ఇందుకు ఆయన ఓ కండీషన్ కూడా పెట్టాడు. ఎక్కాలను పూర్తిగా కంఠస్థం చేసి అప్పగించిన వారికే ఈ విమాన ప్రయాణ అవకాశం ఉంటుందని ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పోటీ పడి మరీ ఎక్కాలను నేర్చుకున్నారు. అలా గెలుపొందిన విద్యార్థులను ఆయన విమానంలో చెన్నైకి తీసుకువెళ్లి వారి కలను నిజం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ కావడంతో మాస్టర్ యూఆర్ గ్రేట్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Read Also: లైవ్ స్ట్రీమింగ్లో యాక్సిడెంట్.. ఐసీయూలో యూట్యూబర్
Follow Us On: Instagram

