కలం, వెబ్ డెస్క్ : పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50 శాతం వాణిజ్య ఎల్పీజీ (LPG) కేటాయింపులకు అదనంగా మరో 20 శాతాన్ని పెంచుతూ కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దీనివల్ల పారిశ్రామిక అవసరాలకు అందే గ్యాస్ కోటా గరిష్టంగా 70 శాతానికి చేరుకోనుంది. సంక్షోభానికి పూర్వం ఉన్న వినియోగ స్థాయిని పరిగణనలోకి తీసుకుని ఈ అదనపు కేటాయింపులు చేయనున్నారు.
ముఖ్యంగా ఉపాధి కల్పన ఎక్కువగా ఉండే ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్టైల్, డై, కెమికల్స్, ప్లాస్టిక్ వంటి రంగాలకు ఈ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ఇతర ఇంధన వనరుల వాడకానికి అవకాశం లేని, కేవలం ఎల్పీజీతోనే హీటింగ్ ప్రక్రియలు నిర్వహించే పరిశ్రమలకు ఈ అదనపు సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వీటితో పాటు సంస్కరణల ఆధారితంగా ఇచ్చే 10 శాతం అదనపు కోటాను కూడా తక్షణమే వినియోగించుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. పెరిగిన గ్యాస్ కేటాయింపులతో రాష్ట్రాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

