కలం, ఆలేరు : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి (Gongidi Sunitha) అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆలేరు పురపాలిక (Aleru Municipality) జరుగుతున్న ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. రైతు బంధు, వృద్ధులకు రూ. 4000 పెన్షన్, మహిళలకు రూ. 2500 ఆర్థిక సాయం, వడ్లకు రూ.500 బోనస్, తులం బంగారం వంటి హామీలలో ఒక్కటీ ఇప్పటివరకు అమలు కాలేదని సునీతా విమర్శించారు.
రైతులకు అవసరమైన యూరియా బస్తాల సరఫరాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడగానే ప్రజల ముందుకు వచ్చి మాయమాటలతో ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు హామీల అమలుపై గట్టిగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుబంధు బకాయిలు, సన్నబియ్యం బోనస్ బకాయిలు, నిరుద్యోగం, నిరుద్యోగులకు భృతి, విద్యా భరోసా అమలు కాకపోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ రెండేళ్లుగా చెల్లించకపోవడంతో పాటు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు.
అలాగే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ, ఆటో కార్మికులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయలేదని మండిపడ్డారు. ఆలేరు మున్సిపాలిటీ (Aleru Municipality) లో 12, వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ మొగులగాని మల్లేష్ గౌడ్, బేతి రాములు, కందుల శంకర్, జంపాల దశరథ, కూతటి అంజన్ కుమార్, కుండే సంపత్, సీస రాజేష్, సరబు సంతోష్, పూల శ్రవణ్, క్యాసగళ్ల అనసూయ, యాట విజయ, తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఏడాదికే కోటీశ్వరుడైన బాలుడు.. ఈ చిన్నారి బర్త్డే గిఫ్ట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Follow Us On: Sharechat


