కలం, వెబ్ డెస్క్ : ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ (Bandra railway station) పరిసరాల్లో చాన్నాళ్లుగా తిష్టవేసిన అక్రమ చొరబాటుదారుల స్థావరాలను అధికారులు ఎట్టకేలకు నేలమట్టం చేశారు. రైల్వే అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకంగా మారిన బంగ్లాదేశ్, రోహింగ్యా శరణార్థుల అక్రమ కట్టడాలపై సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు. ఇక్కడ నివసించే కొందరి వల్ల స్థానికంగా దౌర్జన్యాలు, దొంగతనాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, డ్రగ్స్ విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది 400కు పైగా అక్రమ ఇళ్లు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలను పూర్తిగా తొలగించారు. ఈ ఆపరేషన్ ద్వారా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. కూల్చివేతల ప్రారంభంలో కొందరు అధికారులు, పోలీసులపై రాళ్లు రువ్వారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ప్రస్తుతం అక్కడి నివాసితులు గుంపులు గుంపులుగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అయితే వీరంతా స్వదేశానికి వెళ్లకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాంద్రా నుండి బయలుదేరిన ఈ అక్రమ వలసదారులు ఇతర నగరాల్లో స్థిరపడకుండా ప్రజలు, స్థానిక యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

