కలం, వెబ్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ నేత షమీమ్ అహ్మద్ (TMC Shamim Ahmed) నివాసంపై పోలీసులు జరిపిన దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హౌరాలోని షిబ్పూర్లో ఉన్న ఆయన నాలుగంతస్తుల భవనంలో తనిఖీలు చేపట్టగా, ఒక రహస్య విలాసవంతమైన ఫ్లాట్ బయటపడింది. బయటకు సాధారణంగా కనిపించే ఈ ఇంట్లో మెట్ల మార్గం ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేసిన ట్రాప్-డోర్ వెనుక ఈ రహస్య ఫ్లాట్ ఉంది. ఇల్లు మామూలుగా ఉన్నప్పటికీ.. ఈ రహస్య భాగంలో ఖరీదైన ఇంటీరియర్స్, సీసీటీవీ కెమెరాలు, బెడ్రూమ్, కిచెన్ వంటి అత్యాధునిక సౌకర్యాలు బయటపడ్డాయి.
ఎన్నికల ఫలితాల రోజున షిల్ పారా లేన్లో బీజేపీ మైనారిటీ సెల్ విజయోత్సవ ర్యాలీపై జరిగిన బాంబు దాడిలో షమీమ్ అహ్మద్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సోదాల్లో బంగారు పూత పూసిన బెడ్ (Gold Bed) దొరికొంది. ప్రస్తుతం షమీమ్ అహ్మద్, ఆయన భార్య (స్థానిక కౌన్సిలర్) పరారీలో ఉండటంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
మరోవైపు కోల్కతా పోలీసులు ఆనందపూర్ ప్రాంతంలోని తృణమూల్ నేత నారాయణ్ రంజిత్ ఇంట్లో జరిపిన సోదాల్లో భారీగా తుపాకులు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న రంజిత్ను, అతని అనుచరుడిని ఒడిశాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసగా తృణమూల్ నేతలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో రాజకీయంగా దుమారం రేగుతోంది.

