కలం, కరీంనగర్ : ఎన్నికల సమయంలో ఆడబిడ్డల వివాహానికి ‘తులం బంగారం’ ఇస్తామని ఆర్భాటంగా హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ మాట నిలబెట్టుకోలేక ఇప్పుడు కుట్రలకు తెరలేపిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు (Naradasu laxman Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
తులం బంగారం ఇవ్వడం చేతకాక, మరోవైపు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నిలిపివేసేందుకు ప్రభుత్వమే తెరవెనుక నుండి హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నారదాసు మాట్లాడారు. కోర్టు స్టే విధించినా కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చినా ఉద్దేశపూర్వకంగానే స్పందించలేదని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే హైకోర్టు ఈ పథకాలపై స్టే ఉత్తర్వులు జారీ చేసేలా పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా శ్రేణులు పాల్గొన్నారు.

