కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయ పరిధిలో జీఎంఆర్ ఏరో టెక్నిక్ లిమిటెడ్ నూతనంగా ‘ఏరో స్కూల్ ఆఫ్ ఏవియేషన్’ (Aero School)ను ప్రారంభించింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు విమానయాన రంగంలో అద్భుతమైన శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపుతో ఏర్పాటైన ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు విమాన రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ సందర్భంగా జీఎంఆర్ ఏరో టెక్నిక్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అశోక్ గోపీనాథ్ మాట్లాడుతూ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) నిబంధనల ప్రకారం ఇక్కడ బేసిక్ ఎయిర్ కమాండ్ ఇంజిన్ శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రత్యేక విమానాలకు సంబంధించిన టైప్ ట్రైనింగ్ కూడా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ పాఠశాలకు అనుబంధంగా మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ (MRO) సౌకర్యం ఉండటం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆయన వివరించారు.

