కలం, నిజామాబాద్ బ్యూరో : బక్రీద్ పండుగ (Bakrid Festival) నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(CP Sai Chaitanya), మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలోని చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి గ్రామ సరిహద్దు చెక్పోస్ట్తో పాటు జానకంపేట్, పాల్ద–జన్నపల్లి చెక్పోస్టులను అర్ధరాత్రి సమయంలో సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న తనిఖీలను పరిశీలించారు. బక్రీద్ పండుగ సందర్భంగా మూగజీవాల రవాణా, అక్రమ కార్యకలాపాల నేపథ్యంలో పోలీసులు 24 గంటల ప్రత్యేక నిఘా కొనసాగించాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చే అనుమానాస్పద వాహనాలు, నిషేధిత పదార్థాలు, అక్రమ నగదు రవాణాపై కఠిన తనిఖీలు చేపట్టాలని సూచించారు.
తనిఖీల సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించాలని, అవసరమైతే సాంకేతిక పరికరాల సహాయంతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో చెక్పోస్టులు కీలక పాత్ర పోషిస్తాయని కమిషనర్ పేర్కొన్నారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

