కలం, వెబ్ డెస్క్: మత్స్యకారులను హీనంగా భావించే వ్యక్తి చంద్రబాబు (Chandrababu) అని వైసీపీ నేత, విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ (Ganesh Kumar) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మత్స్యకారులను తోలు తీస్తా అని చంద్రబాబు హెచ్చరించాడని ఆరోపించారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ప్రతీ మ్యానిఫెస్టోలో మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తా అని చంద్రబాబు రాస్తారని.. కానీ అవి అమలు చేయరని మండిపడ్డారు. చంద్రబాబుతో తాను కలిసి పని చేశానని.. మత్స్యకారులను బాబు ఎలా మోసం చేస్తాడో తనకు తెలుసు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా చంద్రబాబు ఒక్క జెట్టీ అయినా నిర్మించాడా? అని ప్రశ్నించారు. మత్సకారుల కోసం గంగవరంలో జెట్టీ కడతానని చెప్పి బాబు మోసం చేశాడని అన్నారు.
చంద్రబాబుని నమ్మి మోసపోయిన వారిలో మత్స్యకారులు (Fishermen Issues) కూడా ఉన్నారని వాసుపల్లి ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో పోర్టుల నిర్మానానికి జగన్ శ్రీకారం చుట్టారని చెప్పారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. జువ్వలదిన్నెలో వైఎస్ జగన్ అద్భుతమైన హార్బర్ నిర్మించారని చెప్పారు. కరోనా కష్ట సమయంలోనూ జువ్వలదిన్నె హార్బర్ నిర్మించారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బాబు గాలికి వదిలేశారని విమర్శించారు. లోకేష్ వ్యవహారం చంద్రబాబుని నాశనం చేస్తుందని ఆరోపించారు. జువ్వలదిన్నెలో సగం డిఫెన్స్ అకాడమీకి ఇస్తున్నారని.. క్విడ్ ప్రోకో ద్వారా మీకు ఎంత ముట్టిందని చంద్రబాబును ప్రశ్నించారు. 2029లో వైఎస్. జగన్ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు హార్బర్ అభివృద్ధికి రూ. 15 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ అడిగితే ఇవ్వలేదన్నారు. వైఎస్. జగన్ అధికారంలోకి వచ్చిరూ.150 కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు. వైజాగ్ హార్భర్ ను అన్ని రకాలుగా జగన్ అభివృద్ధి చేశారని అన్నారు.

