కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు (Chittoor) నగరంలో గత మూడు రోజులుగా చిరుత పులుల సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ముఖ్యంగా దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్ పరిసరాల్లో చిరుతలు తిరుగుతుండటంతో అటుగా వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ క్రమంలో ఒక చిరుత పులి గాయాలపాలై స్పృహ తప్పి పడిపోవడం స్థానికంగా కలకలం రేపింది. స్పృహ తప్పి పడి ఉన్న చిరుతను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన చిరుతకు చికిత్స అందించడంతో పాటు, దాన్ని సురక్షితంగా తరలించేందుకు తిరుపతి నుండి ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ టీం రావాల్సి ఉంది. రెస్క్యూ టీం రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. చిరుత ఎప్పుడు కోలుకుంటుందో, ఎటువైపు దాడి చేస్తుందో అన్న భయంతో చుట్టుపక్కల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

