కలం, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Impact Summit) ను వివాదాలు వదలడం లేదు. మొదటి రోజు మంగళవారం సౌకర్యాల కొరతతో తీవ్ర విమర్శలు చెలరేగగా ఏకంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నిన్న భారీ క్యూలు, దొంగతనాలు, గందరగోళం ఇబ్బంది పెట్టగా.. రెండో రోజైన బుధవారం చైనా రోబో డాగ్ తీవ్ర వివాదానికి కారణమైంది.
అసలేమైందంటే..
ఏఐ సమ్మిట్లో నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ఒక స్టాల్ పెట్టింది. అందులో ఓ డాగ్ రోబోను ప్రదర్శించింది. దాని పేరు ఓరియన్ (Orion)గా పేర్కొంది. దానిని తామే తయారుచేశామని, అందుకోసం రూ.350 కోట్లు ఖర్చయిందని యూనివర్సిటీ ప్రతినిధి మీడియాతో చెప్పారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం రాజుకుంది.
ఆ రోబో డాగ్ చైనాలో తయారైందని, దానిని యునిట్రీ అనే కంపెనీ తయారుచేసిందని, పేరు యునిట్రీ గో2(Unitree Go2) అని ఆధారాలతో సహా నెటిజన్లు పోస్ట్ చేశారు. దాన్ని తామే తయారుచేశామని చెప్పుకోవడం సిగ్గుచేటంటూ విరుచుపడ్డారు. అంతేకాదు, కేంద్రంపైనా విమర్శలు గుప్పించారు. చైనా నెటిజన్లు ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ భారత్ను ఎగతాళి చేసే రాతలు రాశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం కేంద్రం తీరును ఎండగట్టారు. సరైన ప్రణాళిక లేకుండా, కేవలం పేరు, ప్రచారం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం పాకులాడుతోందని విమర్శించారు. పరిస్థితి ఇబ్బంది కరంగా మారడంతో కేంద్రం స్పందించింది. గల్గోటియాస్ స్టాల్ను ఖాళీ చేయించింది.
దక్షిణ కొరియా డ్రోన్నూ..
మరోవైపు గల్గోటియాస్ ప్రతినిధులు మాత్రం ఆ రోబోను తాము తయారుచేశామని చెప్పలేదని, అది చైనాలో తయారైందని, తమ విద్యార్థులకు వివరించేందుకు కొన్నామని చెప్పింది. అయితే, ఇదొక్కటే కాదు, గల్గోటియాస్ స్టాల్లోని ఒక డ్రోన్కు సంబంధించి కూడా వివాదం తలెత్తింది. దక్షిణ కొరియాలో తయారైన ఆ డ్రోన్ను తామే తయారుచేశామని గల్గోటియాస్ ప్రతినిధులు అనడమే దీనికి కారణం.
జనసంద్రం.. సమ్మిట్ పొడిగింపు..
వివాదాలు, సౌకర్యాల లేమి ఉన్నా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు (AI Impact Summit) మాత్రం ఊహించినదాని కంటే భారీ స్థాయిలో సందర్శకులు పోటెత్తుతున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి కంపెనీల వ్యవస్థాపకులు, అత్యున్నత అధికారులు, స్టార్టప్లు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు హాజరవడంతో సమ్మిట్ జనసంద్రంతో కిటకిటలాడుతోంది. దీంతో కేంద్రం సమ్మిట్ గడువును పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 నుంచి 20 వరకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ జరగాల్సి ఉంది. అయితే, 21వరకు జరిపేందుకు కేంద్రం నిర్ణయించింది.
Read Also: హామీ 42%.. గెలిచింది 62%.. ‘మున్సిపోల్స్’లో రిజర్వేషన్
Follow Us On: Instagram


