కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ (Future City) కోసం భూ సేకరణ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో 283.22 ఎకరాల పట్టా భూములు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 200 మంది దీని వలన ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే పరిహార విషయమై అధికారులు చర్చలు జరపబోతున్నారు. అయితే, ఇప్పటికే భూముల విషయమై పెద్ద వివాదం చెలరేగింది. గతంలో లగచర్ల వంటి గ్రామాల్లో ఉద్రిక్తతలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భూ సేకరణ చర్చనీయాంశంగా మారింది.
ఫార్మా సిటీ పోయి ఫ్యూచర్ సిటీ..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల, కడ్తాల్, యాచారం, కందుకూరు ప్రాంతాల్లో సుమారు 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మించేందుకు భారీగా భూ సేకరణ ప్రారంభించింది. ప్రభుత్వం దిగిపోయేనాటికి సుమారు 12 వేల ఎకరాలు సేకరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఫార్మా సిటీ వద్దని భూములు కోల్పోతున్నవారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం అదే భూముల్లో ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించింది. ఇందుకోసం మొత్తంగా 20 వేల ఎకరాలు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. దీనిపై కూడా నిరసనలు జరుగుతుండగా.. హైకోర్టులో పలు కేసులు నమోదు అవడంతో ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఒక్కో ఎకరానికి గరిష్ఠంగా రూ.82 లక్షలు అందించి అయినా, భూ సేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

