కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్(Nizamabad) కలెక్టరేట్లో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (TNGO) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి (ILA Tripathi) ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీ చేపట్టడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓ (TNGO) ప్రతినిధులు నిరంతరం కృషి చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులతో పాటు వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలకు కూడా ఈ అంబలి కేంద్రం వేసవిలో చల్లదనాన్ని, ఉపశమనాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.

