కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar)లోని అంబేద్కర్ నగర్, వ్యవసాయ మార్కెట్ ఏరియా పరిధిలో సర్వే నెం. 53లోని ప్రభుత్వ భూమిని, స్మశానవాటికను కబ్జా (Karimnagar Cremation Ground) చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, 27 డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల తంగేళ్ల కిరణ్ కుమార్ ఆర్డివోను కలసి విజ్ఞప్తి చేశారు. సర్వే నెం. 53 పూర్తి విస్తీర్ణం కొలిపించి, కబ్జా చేసిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని స్మశాన వాటికకు అప్పగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా బండారి శేఖర్ మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ భూమి సర్వే నెం. 53 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేసి గోడలు నిర్మించి గేట్లు పెట్టుకుంటే రెవిన్యూ, మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు.
కబ్జాదారులతో అధికారులు కుమ్మక్కయ్యారు..
గత 50 సంవత్సరాలుగా అంబేద్కర్ నగర్, 27వ డివిజన్ కాలనీ వాసులు ఎవరైనా చనిపోతే స్మశాన వాటికకు తీసుకువెళ్లడానికి, మళ్లీ రావడానికి ఈ (దారిని) రోడ్డును ఉపయోగించేవారని చెప్పారు. చివరికి రోడ్డును కబ్జా చేసి గేట్లు పెట్టడం, కందుకలు తీయడం జరిగిందని అన్నారు. అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా కొంతమంది వ్యక్తులు పట్టా సర్వే నెంబర్ తో ప్రభుత్వ భూమి 53 సర్వే నెంబర్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని స్మశాన వాటికను, వెళ్లే దారిని గోడలు నిర్మించి గేట్లను నిర్మించినా అధికారులు మాత్రం ఏమి పట్టనట్లు వ్యహరించడం అన్యాయమని అన్నారు.
అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదురకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా అంబేద్కర్ నగర్ కాలనీవాసులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వే నెం. 53ను పూర్తి విస్తీర్ణం కొలిపించి కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్మశాన వాటికను సందర్శన చేసి గేట్లు బద్ధాలు కొడుతామని హెచ్చరించారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం.. జూన్ 1న విచారణకు ఎమ్మెల్యే యెన్నం
Follow Us On : WhatsApp

