కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, సీనియర్ నేత గాదె వెంకట రెడ్డి (Gade Venkata Reddy) మరణించారు. కొంతకాలంగా వయోభారంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 85 ఏళ్ల వెంకట రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల వైసీపీ అధినేత జగన్ సహా వివిధ పార్టీల రాజకీయ నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో 1940 జూలై 10న జన్మించిన గాదె వెంకట్ రెడ్డి లాయర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1967 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, 27 ఏళ్ల వయస్సులోనే తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
దేవాదాయ శాఖపై ప్రత్యేక ముద్ర..
1991, 1994 సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి.. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పర్చూరు నియోజకవర్గం నుంచి ఓడిపోతుండటంతో 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో చేరారు. అక్కడ నాలుగేళ్లు పనిచేశాక, జగన్ ఆహ్వానం మేరకు 2020లో వైసీపీలో చేరారు. వయోభారం, అనారోగ్య కారణాల వల్ల ఆయన క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.
Read Also: వండర్ బామ్మ : 80 ఏళ్ల వయసులో చెట్టు ఎక్కగలదు.. చిటారునున్న చింత చిగురు కోయగలదు
Follow Us On : WhatsApp

