కలం, వెబ్ డెస్క్: ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు కీలక మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. వారిలో మల్ల రాజిరెడ్డి (Former Maoist Rajireddy) అలియాస్ సంగ్రామ్ ఒకరు. కాగా శనివారం రాజిరెడ్డి తన సొంత ఊరు మంథనికి చేరుకొని కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దాదాపుగా 40 ఏండ్ల తర్వాత రాజిరెడ్డి సొంతూరుకు రావడం గమనార్హం. స్వగ్రామానికి రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రాజిరెడ్డి తెలిపారు. ఇకపై కుటుంబంతో కలిసి సాధారణ జీవితం గడపాలని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, చట్టాల పరిధిలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, సమాజానికి సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాజిరెడ్డి పేర్కొన్నారు.

