కలం, వెబ్ డెస్క్: కర్ణాటక (Karnataka)లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో పూజల కోసం వెళ్లిన కొందరు సరదాగా ఫోటోలు దిగుదామని కావేరి నది (Cauvery River)లోకి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నది లోతును గమనించకుండా వెళ్లి మునిగిపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మాండ్యా జిల్లా ముత్తతి కావేరి నది కబ్బాలమ్మ, ముత్తితిరాయ అనే ఆలయాలు ఉన్నాయి. ఓ కుటుంబం గురువారం ఉదయం ఆలయంలో పూజల కోసం వచ్చింది. ఆలయంలో పూజలు ముగించుకున్న ఏడుగురు కుటుంబసభ్యులు పక్కనే ఉన్న కావేరి నదిలో ఫోటోలు దిగేందుకు వెళ్లారు.
నది లోతును గమనించకుండా ముందుకు వెళ్లడంతో ముందుగా విజయ్మ(50) అనే మహిళ గల్లంతైంది. ఆమెను కాపాడేందుకు చైత్ర (20), శ్వేత(30), ప్రియాంక (28) ముందుకు వెళ్లడంతో ఈత రాక వాళ్లు కూడా నదిలో మునిగిపోయారు. వీరిని కాపాడేందుకు మహేశ్ అనే యువకుడు నదిలోకి దిగాడు. అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం ఏడుగురు కుటుంబ సభ్యులు దైవ దర్శనానికి రాగా రవి అనే వ్యక్తితో పాటు ఓ చిన్నారి మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం నది వద్దకు చేరుకొని గాలించారు. ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. కుటుంబసభ్యుల మృతితో రవి కన్నీరుమున్నీరుగా విలపించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

