కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని సికింద్రాబాద్ (Secunderabad) అడ్డగుట్ట పరిధిలో అర్థరాత్రి ఒక్కసారిగా కలకలం రేపింది. ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో భూమిలో నుండి మంటలు ఎగసిపడటంతో బస్తీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భూమిలో నుంచి మంటలు మెరుపుల్లా భారీ సౌండ్లతో చెలరేగడంతో స్థానికంగా భూకంప విస్ఫోటనంగా కనిపించింది. మరమ్మత్తుల కోసం తవ్విన రోడ్డులో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ (Electrical wires short circuit) కావడంతో ప్రమాదం సంభవించింది. జేఎన్ఆర్ఎం 5వ బ్లాక్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యుత్ శాఖ అధికారులకు వెంటనే సమాచారం అందించినా స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100కు కాల్ చేసినా స్పందన లేదని ప్రజలు వాపోయారు. తొలుత మంటలకు గల కారణాలు తెలియకపోవడంతో అసలేమైందో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఇళ్లనుంచి వెంటనే బయటికి వచేశారు. ఇంత భారీ ప్రమాదం సంభవించిందని సమాచారం అందించినా.. ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాదికారులు, అగ్నిమాపక సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

