కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలోని నారాయణస్వామి నగర్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. స్థానికంగా ప్రాచుర్యం పొందిన లక్ష్మీ మెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి,హోటల్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఆదివారం కావడంతో మెస్ యజమానులు హోటల్కు సెలవు ప్రకటించి మూసివేశారు. సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ మంటల ధాటికి హోటల్ ముందు ఉన్న కట్టెల పందిరి, రేకుల షెడ్డు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. లోపల గ్యాస్ సిలిండర్లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని, భారీ శబ్దాలతో హోటల్లోని సామగ్రి అంతా కాలిపోయిందని నిర్వాహకులు తెలిపారు.
హోటల్ యజమాని పరమేశ్వర్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు నుండి మూడు లక్షల రూపాయల వరకు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించకుండా అప్రమత్తమై, సుదీర్ఘ శ్రమ తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. చుట్టుపక్కల ఇళ్లు దూరంగా ఉండటంతో ప్రమాదం తృటిలో తప్పిందని స్థానికులు తెలిపారు.

