కలం, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం భారీ ఆందోళన (Farmers Protest) చేపట్టారు. భూదాన్ పోచంపల్లి కేంద్రంలోని ప్రధాన కూడలి అయిన నేతాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కలిసి ధర్నాకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులు తాము పండించిన ధాన్యం బస్తాలను రోడ్డుపై గుమ్మరించి వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు.
కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచి చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, వర్షాల ముప్పు పొంచి ఉన్నా కొనుగోళ్లు జరపకపోవడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీఎం కేంద్రాల్లో వరి ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేవరకు తమ పోరాటం ఆపేది లేదని రైతులు, బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

