కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ జిల్లా హసన్పర్తి (Hasanparthy) మండలంలోని మడిపెల్లి ఐకేపీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత నాలుగు రోజులుగా అధికారులు వడ్లు కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ముంజ శ్రీను గౌడ్ (45) అనే రైతు, తన ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, అధికారుల నిర్లక్ష్యం వల్లే శ్రీను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కొనుగోళ్లే వేగవంతం చేయాలని కోరుతున్నారు.

