కలం, వెబ్డెస్క్: ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) ఆధ్వర్యంలో జరిగిన స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశం ఈ వివాదానికి వేదికైంది. ఈ కీలక సమావేశానికి జిల్లా జనసేన అధ్యక్షుడు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్కు ఆహ్వానం అందకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడిని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ రియాజ్ వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది.
ఈ క్రమంలో బాలినేని, రియాజ్ వర్గీయుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అమ్ముడుపోయారని, ఇప్పుడు పార్టీలో ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారని, రియాజ్ అనుచరులు తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్ఆలో పట్టు కోసం సాగుతున్న ఈ బాలినేని వర్సెస్ రియాజ్ పోరు ఇప్పుడు జనసేన అధిష్టానానకి పెద్ద తలనొప్పిగా మారింది. కూటమి ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న నాయకుల మధ్య ఇలాంటి బహిరంగ విభేదాలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

