కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ సీహెచ్ ప్రియాంక మంగళవారం తనిఖీ చేశారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీల్ను పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను తనిఖీ చేశారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భంలో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు. గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా 24 గంటలు భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, గోదాంలోని భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ జయ సుధ, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శంకర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

