కలం, వెబ్ డెస్క్ : తిరుపతి (Tirupati) జిల్లాలోని భాకరాపేట (Bhakarapet) కనుమ రహదారిపై సోమవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపైకి వచ్చిన అడవి ఏనుగులు కొంతసేపు అటూ ఇటూ తిరుగుతుండటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల కదలికల కారణంగా రెండు వైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఇదే సమయంలో అత్యవసర సేవలకు వెళ్తున్న రెండు అంబులెన్సులు కూడా ట్రాఫిక్లో చిక్కుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనాస్థలికి చేరుకున్నారు.
పరిస్థితిని సమీక్షించిన అధికారులు అంబులెన్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత గమ్యస్థానాలకు పంపించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమివేశారు. అనంతరం రహదారిపై ట్రాఫిక్ను క్రమంగా పునరుద్ధరించారు. ఈ ఘటనతో భాకరాపేట (Bhakarapet) కనుమ మార్గంలో ప్రయాణించే వాహనదారులు కొంతసేపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అడవి ప్రాంతాల గుండా ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also: ఎయిర్ షోలో దుర్ఘటన.. గాలిలో ఢీ కొట్టుకున్న యుద్ధ విమానాలు!
Follow Us On: WhatsApp

