కలం, వెబ్ డెస్క్: దేశంలో అత్యున్నత మూడో పౌర పురస్కారాలైన పద్మ శ్రీ అవార్డులను (Padma Shri Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా తెలంగాణకు చెందిన ఎనిమిది మందిని ఈ పురస్కారాలు వరించాయి. రేపు రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో పద్మ శ్రీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించబోతున్నారు.
- డాక్టర్ గూడూరు వెంకట్ రావు: ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడు. 12 వేల సర్జరీలు చేయడంతో పాటు 16 వేల ఎండోస్కోపిక్ ఆపరేషన్లు కూడా చేశారు. మాక్రో ఎన్ క్యాఫ్సులేషన్ డివైస్ కనుగొనడంతో కీలక పాత్ర పోషించారు.
- డాక్టర్ పాల్గొండ విజయానంద్ రెడ్డి: ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు. అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్గా ఉన్నారు. ‘క్యూర్’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. దశాబ్దాల పాటు ఆంకాలజీ రంగంలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
- డాక్టర్ కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్: మెటీరియల్స్ ఇంజినీర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈయన హైదరాబాద్ కంచన్బాగ్లోని నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. భారతీయ మెటీరియల్ సైన్స్ రంగంలో దేశంలోనే విశిష్ఠ శాస్త్రవేత్తల్లో ఈయన ఒకరు.
- డాక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి: డీఆర్డీవో విశ్రాంత శాస్త్రవేత్త. ఆకాశ్ క్షిపణి రూపకర్తల్లో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్గా 34 ఏళ్ల పాటు పనిచేయడం కూడా ఒక రికార్డు.
- డాక్టర్ కుమారసామి తంగరాజ్: తమిళనాడుకి చెందిన ఈయనకు తెలంగాణ కోటాలోనే పద్మ శ్రీ దక్కడం గమనార్హం. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసిన తంగరాజ్ భారతీయ జన్యుశాస్త్ర రంగంలో అత్యున్నత పరిశోధకుడిగా గుర్తింపు పొందారు.
- మామడి రామారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చెందిన ఈయన.. గతేడాది అక్టోబరులో మరణించారు. మరణాంతరం ఆయనకు పద్మ శ్రీ అవార్డు దక్కింది. సహకార ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈయన.. మాక్స్ చట్ట రూపకల్పన కమిటీల్లోనూ పనిచేశారు.
- ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్: 2022 నుంచి 2025 వరకు యూజీసీ మాజీ ఛైర్మన్, ప్రస్తుతం ఐఐఎం కోల్కతా గవర్నింగ్ బాడీ ఛైర్మన్. దేశంలోనే ప్రముఖ విద్యావేత్తగా పేరున్న ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లా మామిడాల గ్రామం. జేఎన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్లర్గా కూడా పనిచేశారు.
- దీపికారెడ్డి: కూచిపూడి నాట్యంలో అత్యంత ప్రతిభావంతురాలు. ఆరేళ్ల వయస్సు నుంచే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టి.. 50 ఏళ్లయినా విశ్రాంతి చెందకుండా ప్రదర్శనలిచ్చి కూచిపూడి కళాకారిణిగా తనకంటూ గుర్తింపు సాధించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి ఛైర్పర్సన్గానూ పనిచేశారు.
Read Also: మహిళా సాధికారత వారోత్సవాలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం
Follow Us On : WhatsApp

