కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ (Dancers Association)లో నెలకొన్న విబేధాలపై ఫిలిం ఫెడరేషన్ మరింత దృష్టి పెట్టింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య జరుగుతున్న గొడవకు ఎండ్ కార్డ్ వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం అసోసియేషన్తో సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.
డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రత్యేక సంస్థ కాదని.. ఫిలిం ఫెడరేషన్లోని 23 రకాల యూనియన్లలో ఒకటని అధ్యక్షుడు అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. రెండు వర్గాలతో చర్చలు జరిపినా.. పరిష్కారం లభించలేదన్నారు. అందుకే, ఫిలిం ఫెడరేషన్ స్థాయిలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
గొడవ ఎక్కడ మొదలైందంటే..!
డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు సభ్యులు ఆరోపణలు గుప్పించారు. దీంతో, ప్రస్తుత యూనియన్ రద్దు చేసి, ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆమె భావించారు.
ఈ నిర్ణయాన్ని తప్పు పట్టిన సభ్యుల్లో 10 మంది వెంటనే రాజీనామా చేయడంతో గొడవ మరింత ముదిరింది. ఇక్కడే అసోసియేషన్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలుగా విడిపోయింది. వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడం.. ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది.
మెగాస్టార్ పిలిపించి..
గొడవ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి జానీ, శేఖర్ మాస్టర్లను పిలిపించుకుని.. వారితో మాట్లాడారు. సమస్య ఏదైనా సామరస్యపూర్వంగా, ఫిలిం ఫెడరేషన్లో పరిష్కరించుకోవాలని సూచించారు.
ఫెడరేషన్ కూడా సమావేశమై ఈ సమస్యను కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆదివారం కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ కలుగుతోంది.

