సీతక్క హామీ.. ఆందోళన విరమించిన గురుకుల విద్యార్థినులు

కలం, మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల (Gandhinagar Tribal Gurukul)లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో గురువారం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో తాగడానికి, నిత్యావసరాల కోసం సరిపడా నీరు అందకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆరోపించారు.

నీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ నిరసన కొనసాగిస్తామని విద్యార్థినులు స్పష్టం చేశారు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల ద్వారా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన మంత్రి.. గురుకుల పాఠశాల విద్యార్థినులతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. వారి సమస్యలను ఓపికగా విన్న మంత్రి, తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిగణించి 12 గంటల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత అధికారులు వెంటనే పాఠశాలకు వెళ్లి పరిస్థితిని పరిశీలించి, తాత్కాలికంగా నీటి సరఫరా పునరుద్ధరించడంతో పాటు శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి నుంచి స్పష్టమైన హామీ ఇవ్వడంతో విద్యార్థినులు తమ ఆందోళనను విరమించారు. త్వరితగతిన స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వారు, ఇచ్చిన హామీ మేరకు నిర్ణీత గడువులో సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>