ఓటర్లకు అలర్ట్.. ఆ తేదీలోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించండి: సునీల్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ఓటర్లందరూ తమ ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను ఆగస్టు 3వ తేదీ లోపు సంబంధిత (బీఎల్‌ఓ) బూత్ లెవల్ అధికారులకు సమర్పించి, తమ ఓటు హక్కును కాపాడుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా యాదగిరి సునీల్ రావు తన ఎన్యుమరేషన్ ఫారాన్ని పూరించి అధికారులకు సమర్పించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తుచేశారు. మనల్ని పాలించే, పరిపాలన అందించే సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఓటు అనేది ప్రతి పౌరుడికి ఒక ఆయుధం లాంటిదని అన్నారు. ఒకవేళ మనం ఓటు హక్కును కాపాడుకోలేకపోతే, పాలకులను ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.

ఆగస్టు 3వ తేదీలోపు నగర ప్రజలందరూ తమ పరిధిలోని బీఎల్‌ఓలను సంప్రదించి, ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిచేసి సమర్పించాలని పేర్కొన్నారు. ఎలాంటి తప్పులు లేని, పకడ్బందీ ఓటరు జాబితాను తయారు చేసే ప్రక్రియలో ప్రజలందరూ అధికారులకు పూర్తిగా సహకరించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ ప్రాథమిక హక్కును ఎవరూ వదులుకోవద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫారాలను సమర్పించి ఓటరు జాబితా రూపకల్పనలో భాగస్వాములు కావాలని యాదగిరి సునీల్ రావు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>